Thursday, October 27, 2016

మనిషితనం


కాసేపు చుట్టూ కలియచూసా 
అంతా శూన్యం..చీకటి 
ఎక్కడిక్కడ 
గుంపులు గుంపులు కదులుతోన్న జనం
ఎక్కడో చివర ఒంటరిగా నాలో నాతో నేను 
ఎందుకిలా అంటూ నన్ను నేను ప్రశ్నించుకున్న
దళితులు చస్తే ఏడ్చా 

అగ్రకులాలు నన్ను వెలేసాయ్
అమ్మా సారికా అంటూ గగ్గోలు పెట్టా 
దళితుల గోల నీకెందుకు అంటూ 
వాళ్ళు నన్ను ఒదిలేసారు 
గొడ్డు తింటే బాదుతార అంటూ అరిచా 
హిందూ వ్యతిరేకివన్నారు 

నా మతం గొప్ప నా మతం గొప్ప 
గోడెక్కి కూస్తూ కొట్టుకున్న జనాలని 
ఇదేం పని అన్నా
సంఘ్ పరివార్ ఏజెంట్ అన్నాడొకడు 
ఆలోచించి మనసాక్షిని అడిగా ఇంతకీ 
అసలు నేనెవర్నీ?

నా చుట్టూ ఈ వంటరితనం ఏంటని
మతాలూ కులాలు భుజాన మోసే 
జనాల మద్య ఎవరి చచ్చినా ఏడిస్తే ఎలాగోయ్ 
ఫక్కున నవ్వింది మనసాక్షి 
మనవాడు చస్తే .. 


వీధి పోరాటాలు చేసి మరీ ఏడ్వాలి 
మనవాళ్ళు చంపితే ..
కాసేపు మౌనం పాటించేయాలి
మనిషి చచ్చి మతం గానో కులం గానో మారిన ఈరోజుల్లో 
మతం మోయని నువ్వు ఏ గుంపుకి పనికొస్తావ్
మనసాక్షి మరోసారి నవ్వింది 
కాసేపు చుట్టూ చూస్తున్నా
మనిషి అనేవాడు ఎవడన్న మిగిలితే 
వాడితో కలిసి నడక సాగిద్దామని

No comments:

Post a Comment